ఏలూరు జిల్లా దొడ్డిపట్ల గ్రామంలో మహాశివరాత్రి పండుగ రోజున విషాద సంఘటన చోటుచేసుకుంది. రొయ్యల చెరువు వద్ద ఏరియేటర్ రాడ్కు చీర కొంగు చిక్కుకోవడంతో తల్లి, ఆరేళ్ల కూతురు దుర్మరణం పాలయ్యారు.
ఏలూరు జిల్లా దొడ్డిపట్ల గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పుట్టింటికి వచ్చిన వీరనాగ జ్యోతి, తన ఆరేళ్ల కుమార్తె హేమతో కలిసి తండ్రి సాగు చేస్తున్న రొయ్యల చెరువు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో, చెరువు గట్టున ఉన్న ఇంజన్కు అమర్చిన ఏరియేటర్ (ఫ్యాన్ సెట్) రాడ్కు నాగజ్యోతి చీర కొంగు చుట్టుకుంది.
ఈ ప్రమాదంలో తల్లితో పాటు, ఆమె ఒడిలో ఉన్న చిన్నారి హేమ కూడా రాడ్లో చిక్కుకుపోయి, తిరగడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పండుగ పూట జరిగిన ఈ ఘటన కుటుంబ సభ్యులను, గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ దుర్ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.











