కేరళలోని కొచ్చి వాటర్ మెట్రోలో కొందరు పర్యాటకులు సాంప్రదాయ గర్బా నృత్యం చేస్తూ సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఈ ప్రవర్తనను విమర్శించగా, మరికొందరు సమర్థించారు.
ఫార్ట్ కొచ్చికి వెళ్లే దారిలో కొచ్చి వాటర్ మెట్రోలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో షేర్ అయిన ఈ వీడియోలో, పర్యాటకులు పాటలు పాడుకుంటూ, గుండ్రంగా తిరుగుతూ ఉత్సాహంగా గర్బా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ చర్య ప్రజా రవాణా నియమాలను ఉల్లంఘించడమా కాదా అనే దానిపై చర్చ మొదలైంది.
చాలా మంది నెటిజన్లు ఈ ప్రవర్తనను విమర్శించారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందరికీ సంబంధించినదని, వ్యక్తిగత వేదిక కాదని, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడం ముఖ్యమని వారు అభిప్రాయపడ్డారు. అంతగా వినోదం కోరుకుంటే ప్రైవేట్ బోట్ అద్దెకు తీసుకోవాలని సూచించారు.
అయితే, కొద్దిమంది ఈ పర్యాటకులకు మద్దతుగా నిలిచారు. ప్రయాణంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదని, ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు సహజమేనని వారు వాదించారు. ప్రయాణాల్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం సహజమేనని అభిప్రాయపడ్డారు.
ఇటీవల కాలంలో పర్యాటకులు పబ్లిక్ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేయడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొచ్చి వాటర్ మెట్రో ఉదంతం కూడా ప్రజా ప్రవర్తన నియమాలపై మరోసారి చర్చకు దారితీసింది.












