సంగారెడ్డి, 2026-08-05
నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు ప్రజలకు అతిపెద్ద సవాళ్లుగా మారాయని, వీటిపై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోనీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి. ఆనంద్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో () డైరెక్టర్ షికా గోయల్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెలరోజుల పాటు సురక్షా కా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ పేరుతో సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. ఆగస్టు నెల తొలి బుధవారం నిర్వహించే జాతీయ సైబర్ జాగ్రూకత దివస్ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ ఆంథోనీ డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో సైబర్ నేరాలు ఒకటని అన్నారు. సైబర్ నేరాలకు గురవుతున్న వారిలో విద్యావంతులే అధికంగా ఉండటం ఆందోళనకర విషయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సంవత్సరంలోనే సైబర్ మోసాల కారణంగా సుమారు రూ.1,300 కోట్ల మేర ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని తెలిపారు.
విద్యార్థులందరూ సైబర్ అంబాసిడర్లుగా వ్యవహరించి, తమ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల్లో సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని చైతన్య రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెల్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, సెయింట్ ఆంథోనీ విద్యాసంస్థల వ్యవస్థాపకులు, చైర్మన్ డా. సాల్మన్ రెడ్డి, డిగ్రీ కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రామునాయుడు, సైబర్ సెల్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.











