కామారెడ్డి, 27.07.2026
కామారెడ్డి జిల్లాలో టిబి నిర్మూలన లక్ష్యాలను 2026 చివరి నాటికి సాధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. టిబిపై అవగాహన, సకాలంలో పరీక్షలు, నాణ్యమైన చికిత్స అందించాలని సూచించారు.
కామారెడ్డి జిల్లాలో క్షయ (టిబి) వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.
జిల్లాలో టిబి నిర్మూలన కార్యాచరణ ప్రణాళిక (Roadmap) అమలుపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ, టిబి వ్యాధిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, ప్రతి అనుమానిత వ్యక్తికి సకాలంలో పరీక్షలు నిర్వహించి, నిర్ధారణ అయిన ప్రతి రోగికి నాణ్యమైన చికిత్స అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వ్యాధి ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, అధిక ప్రమాదంలో ఉన్న వర్గాలకు కఫం పరీక్షలు, ఎక్స్రే తదితర నిర్ధారణ సేవలను విస్తృతంగా అందించాలని సూచించారు. టిబి రోగులతో సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యులు, ఇతర పరిచయ వ్యక్తులకు కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించి, అవసరమైన వారికి టిబి నివారణ చికిత్స (TPT) అందించాలని తెలిపారు.












