మహిళా సంఘం నాయకురాలిగా చెప్పుకుంటున్న ఉషారాణి వేధింపులు భరించలేక రైల్వే ఉద్యోగి రవి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతి జిల్లా రేణిగుంటలో కలకలం రేపింది. బుగ్గ వీధిలోని తన నివాసంలో రవి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఉషారాణి, మహిళా సంఘం ముసుగులో రవిని వేధించినట్లు ఆరోపణలున్నాయి.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రవితో ఉషారాణి మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. ఉషారాణికి మూడు పెళ్లిళ్లు అయ్యాయని తెలుసుకున్న రవి, ఆమె ట్రాప్లో పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, రైల్వే సర్వీస్ రికార్డు, బీమా పాలసీలో తనను నామినీగా చేర్చాలని ఉషారాణి రవిని వేధించినట్లు ఆరోపణలున్నాయి.
ఉషారాణి వేధింపులపై రవి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, తగిన చర్యలు తీసుకోలేదని బాధితుడు పేర్కొన్నారు. మ్యాట్రిమోనిలో మరో పెళ్లికి ప్రయత్నిస్తున్న ఉషారాణి గుట్టును రవి బయటపెట్టినా, పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి.
మానసిక క్షోభతో రవి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తన ఆత్మహత్యకు ఉషారాణి వేధింపులే కారణమని, తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని పేర్కొంటూ సూసైడ్ నోట్ రాసి ఉంచారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.












