అమెరికా మరియు దక్షిణ కొరియా సోమవారం నాడు 'ఫ్రీడమ్ షీల్డ్' పేరుతో భారీ సంయుక్త సైనిక విన్యాసాలను ప్రారంభించాయి. ఈ సైనిక కసరత్తులు మార్చి 19 వరకు కొనసాగుతాయి. ఈ విన్యాసాలు ఉత్తర కొరియా నుండి ఎలాంటి ప్రతిస్పందనను తెస్తాయోనని అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.
ఈ విన్యాసాలలో సుమారు 18,000 మంది దక్షిణ కొరియా సైనికులు పాల్గొంటున్నట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. అమెరికా దళాల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఈ సైనిక విన్యాసాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఉత్తర కొరియా ఎప్పటినుంచో అమెరికా, దక్షిణ కొరియాల సంయుక్త సైనిక విన్యాసాలను తమ దేశంపై దాడికి సంకేతాలుగా అభివర్ణిస్తోంది. గతంలో ఇలాంటి విన్యాసాల నేపథ్యంలోనే ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు, సైనిక ప్రదర్శనలు చేపట్టిన సందర్భాలున్నాయి.
అయితే, ఈ విన్యాసాలు కేవలం రక్షణాత్మక చర్యల్లో భాగంగానే నిర్వహిస్తున్నామని అమెరికా, దక్షిణ కొరియా మిత్రదేశాలు స్పష్టం చేశాయి. ఈ సైనిక కసరత్తులు కొరియా ద్వీపకల్పంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఉద్దేశించినవని వారు పేర్కొంటున్నారు.

