ముంబైలోని ఐఐటీ బాంబేలో రెండో సంవత్సరం బీటెక్ విద్యార్థి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో క్యాంపస్లో పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులు సంస్థ యాజమాన్యం నుంచి జవాబుదారీతనం, పారదర్శకత, స్పష్టమైన సమాధానాలు కోరుతూ నిరసన చేపట్టారు.
పరిస్థితిని అదుపులో ఉంచేందుకు క్యాంపస్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ఐఐటీ యాజమాన్యం మధ్య చర్చలు కొనసాగుతున్నాయని డీసీపీ దత్తాత్రయ్ నలవాడే తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు. కొంతమంది విద్యార్థులు ఆందోళన విరమించినప్పటికీ, మరికొందరు క్యాంపస్లోనే కొనసాగుతూ తమ డిమాండ్లపై చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
విద్యార్థి ప్రణయ్ మాట్లాడుతూ.. తమ కళాశాలలో ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నందునే ఆందోళనకు దిగామని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు నాలుగు ఇలాంటి ఘటనలు జరిగాయని, గత రెండు నెలల్లోనే రెండు ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితికి కారణాలేమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.





