వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రసిద్ధ గండి శ్రీ వీరాంజనేయ దేవస్థానంలో ప్రధాన అర్చకుల తీరుపై భక్తులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. హారతి పళ్లెంలో భక్తులు సమర్పించే కానుకల విషయంలో తలెత్తుతున్న వివాదాలు, అదనపు డబ్బుల డిమాండ్ వంటి ఆరోపణలపై దేవదాయ శాఖ అధికారులు స్పందించారు.
రాయలసీమలో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న గండి శ్రీ వీరాంజనేయ దేవస్థానం, ఇటీవల కాలంలో ఆలయ ప్రధాన అర్చకుల ప్రవర్తన తీరుపై వస్తున్న ఫిర్యాదులతో వార్తల్లో నిలుస్తోంది. భక్తులు హారతి పళ్లెంలో ఇచ్చే డబ్బుల విషయంలో అర్చకుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయని, దీనిపై పలువురు భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ ఆరోపణల నేపథ్యంలో, నెల రోజుల క్రితం దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురు ప్రసాద్, భక్తులు సమర్పించే కానుకలను నేరుగా హుండీలో వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే, ప్రధాన అర్చకుడు కేసరి స్వామి ఈ ఆదేశాలను పాటించడం లేదని, కానుకలను వ్యక్తిగతంగా తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి.
మరోవైపు, తెలంగాణకు చెందిన భార్గవ్ అనే భక్తుడు శనివారం ఆలయానికి విచ్చేసి, ఆకు పూజ కోసం రూ. 516 టికెట్ కొనుగోలు చేశారు. పూజ కోసం అర్చకుల వద్దకు వెళ్లగా, అదనంగా రూ. 200 చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు. టికెట్ కొన్న తర్వాత మళ్లీ డబ్బులు అడగడాన్ని ప్రశ్నించిన భార్గవ్, ఈ విషయాన్ని డిప్యూటీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
హిందూ దేవాలయాలలో ఇలాంటి పద్ధతులు భక్తి భావాన్ని దెబ్బతీస్తాయని, అధికారుల కఠిన వైఖరి అవసరమని భార్గవ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని, హారతి పళ్లెంలో కానుకలు సమర్పించారు. ఈ కానుకలను హుండీలో వేయాలని ఆలయ సిబ్బంది కోరగా, అర్చకులు నిరాకరించినట్లు సమాచారం. ఈ వివాదంపై ఆలయ సిబ్బంది లిఖితపూర్వకంగా డిప్యూటీ కమిషనర్కు ఫిర్యాదు చేయగా, ఆయన అర్చకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.









