విజయవాడలోని రాజీవ్ నగర్ - వడ్డెర కాలనీలో నివాస ప్రాంతాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని స్థానిక మహిళలు ఆగ్రహంతో తొలగించారు. దుకాణం ముందున్న టెంట్ను కూల్చివేసి, దుకాణాన్ని తరలించాలని డిమాండ్ చేశారు.
నివాస ప్రాంతాల మధ్య మద్యం దుకాణం ఉండటం వల్ల మహిళలు, యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సామాజిక భద్రతకు భంగం కలుగుతోందని ఆందోళనకారులు తెలిపారు. ఈ విషయంపై అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా స్పందన లేకపోవడంతో మహిళలు స్వయంగా చర్యలు తీసుకున్నారని సమాచారం.
మహిళల ఆందోళనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మహిళలతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
మద్యం దుకాణాల తరలింపుపై ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, లేదంటే ఇలాంటి ఆందోళనలు కొనసాగుతాయని మహిళలు హెచ్చరించారు. ఈ ఘటనపై తదుపరి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.










