ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. యువత, విద్యార్థులు, నిరుద్యోగులు సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తే వారిపై నిఘా పెట్టడం, ఆందోళనలు చేస్తున్న వారిని పర్యవేక్షించడం వంటి చర్యలు జరుగుతున్నాయని పార్టీ నేతలు విమర్శించారు.
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నిరసనలు నిర్వహించడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేయడం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
యువత, నిరుద్యోగులపై నిఘా
విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉద్యోగాలు, నియామక ప్రకటనలు, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని వైఎస్సార్సీపీ తెలిపింది. వారి కదలికలు, సోషల్ మీడియా కార్యకలాపాలు, నిరసన కార్యక్రమాలను పర్యవేక్షించడం వెంటనే నిలిపివేయాలని పార్టీ డిమాండ్ చేసింది. విద్యార్థి జేఏసీ కోరుతున్న నియామక ప్రకటనలను విడుదల చేసి, నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కొండా రాజీవ్ గాంధీ కోరారు. ఎలాంటి వెనుక ద్వార నియామకాలకు అవకాశం లేకుండా ఎంపిక ప్రక్రియ జరగాలని అన్నారు.











