యాడికి, జూన్ 30
యాడికి మండల పరిధిలో తల్లిదండ్రులను కోల్పోయిన నలుగురు చిన్నారులకు జర్నలిస్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగిరెడ్డి, తన మిత్రబృందంతో కలిసి అండగా నిలిచారు. తండ్రి హత్య, తల్లి జైలుకు వెళ్లడంతో అనాథలైన పిల్లలకు విద్యా సామగ్రిని అందజేశారు.
విధి ఆడిన వింత నాటకంలో తల్లిదండ్రుల ఆసరా కోల్పోయిన నలుగురు అనాథ చిన్నారులకు జర్నలిస్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, 'మాటకోసం' ఎడిటర్ జోగిరెడ్డి తన పాత్రికేయ మిత్రబృందంతో కలిసి మానవత్వాన్ని చాటుకున్నారు. యాడికి మండల పరిధిలోని పెద్దపేట గ్రామానికి చెందిన శివప్రసాద్ ను అతని భార్య హైమావతి క్షణికావేశంలో హత్య చేయడంతో, తండ్రి మృతి చెంది తల్లి జైలుకెళ్లడంతో వారి నలుగురు పిల్లలు - ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు అనాథలుగా మారారు.
తల్లిదండ్రులు లేని ఈ పిల్లలను స్థానిక సీఐ శ్రీనివాసులు కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ముగ్గురు ఆడపిల్లలను, యాడికి మండల కేంద్రంలోని పాత పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న నెంబర్-3 పాఠశాలలో ఒక అబ్బాయిని చేర్పించి చదివిస్తున్నారు. వారి చదువులకు తన వంతుగా సహాయం చేయాలని 'మాటకోసం' ఎడిటర్, శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్టూడెంట్ మార్ట్ యజమాని జోగిరెడ్డి వెంటనే స్పందించారు.
పాత్రికేయ మిత్రులతో కలిసి మంగళవారం చిన్నారుల వద్దకు చేరుకుని వారిని పరామర్శించారు. "మీకు మేమున్నాం. చదువు ఆపొద్దు. భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలి" అంటూ ధైర్యం చెప్పి, నలుగురికీ పెన్నులు, పెన్సిళ్లు, నోట్ బుక్స్, ఇతర విద్యా సామగ్రిని, తిను బండారాలను అందజేశారు. భవిష్యత్తులో కూడా వారి చదువులకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.











