కామారెడ్డి, జూలై 28
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి, నకిలీ రబ్బరు ముద్రలు, కంప్యూటర్లు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో భిక్కనూరుకు చెందిన తోడెంగల రాజా నరేందర్, తోడెంగల రాజలింగం, బోయిని ప్రసాద్లను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ తెలిపారు.
ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ చందారి సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితులు ఆన్లైన్ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తుదారుల నుంచి పత్రాలు సేకరించి, ఒక్కో దరఖాస్తుకు రూ.4,500 నుంచి రూ.5,000 వరకు వసూలు చేసినట్లు తేలింది.
అనంతరం ప్రభుత్వ వైద్యాధికారుల పేర్లతో నకిలీ సంతకాలు, నకిలీ అధికారిక రబ్బరు ముద్రలు ఉపయోగించి వయస్సు, మొదటి వివాహ ధృవీకరణ పత్రాలను తయారు చేసి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి కంప్యూటర్ సీపీయూ, మానిటర్, మూడు మొబైల్ ఫోన్లు, నకిలీ రబ్బరు ముద్రలు, స్టాంప్ ప్యాడ్, డిజిటల్ రికార్డులు తదితర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.











