తన భార్య వివాహేతర సంబంధాలు, ఆమె ప్రైవేట్ వీడియోలు బయటకు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనలో భార్యతో పాటు ఆమె ఇద్దరు సన్నిహితులను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే, ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుక దంపతులు 2018లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. హైదరాబాద్లోని బాచుపల్లిలో నివాసం ఉంటున్న సీతారాం సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు.
భర్తకు తెలియకుండా రేణుక, ముగ్గురు వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లు ఆరోపణలున్నాయి. వీరిలో రమణారెడ్డి అనే వ్యక్తితో ఉన్నప్పుడు తీయించుకున్న ప్రైవేట్ వీడియోలను అతను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినట్లు సమాచారం. ఈ విషయం సీతారాం దృష్టికి రావడంతో తీవ్ర కలకలం రేగింది.
తన భార్య ప్రవర్తన, బయటపడిన వీడియోల నేపథ్యంలో సీతారాం తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఫిబ్రవరి నెలలో, 19 పేజీల సుదీర్ఘ ఆత్మహత్య లేఖ రాసి, హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తన జీవితంలో ఏలోటు లేకుండా చూసుకున్నప్పటికీ, భార్య తనను నమ్మించి మోసం చేసిందని లేఖలో పేర్కొన్నారు.
సీతారాం ఆత్మహత్య లేఖలో పేర్కొన్న అంశాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో రేణుకతో పాటు, ఆమె సన్నిహితులైన రమణారెడ్డి, శ్రవణ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారని కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.











