ఏపీ పోలీసుల అక్రమ అరెస్టు యత్నాల నేపథ్యంలో, బిహార్ కేడర్ ఐజీ సునీల్ నాయక్ కు బిహార్ ప్రభుత్వం రక్షణ కల్పించింది. తమ అనుమతి లేకుండా ఏపీ పోలీసులు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేస్తూ, రాష్ట్ర హోంశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. బీఎన్ఎస్ఎస్-218 చట్టం కింద ఈ రక్షణ కల్పించబడింది.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు ఆధారంగా ఐజీ సునీల్ నాయక్ పై నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఏపీ పోలీసు అధికారులు పాట్నా వెళ్లి, ఆయన నివాసంలోకి ప్రవేశించి అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, బిహార్ పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై పాట్నా సివిల్ కోర్టు కూడా ఏపీ పోలీసులపై తీవ్రంగా స్పందించి, ట్రాన్సిట్ వారెంట్ జారీకి నిరాకరించింది.
బిహార్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బిహార్ కేడర్ అధికారులు డెప్యుటేషన్ పై ఇతర రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్నప్పుడు, వారిపై ఏవైనా కేసులు నమోదు చేయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు అనుమతి తప్పనిసరి. కేంద్ర పోలీసు బలగాలకు వర్తించే అన్ని రకాల రక్షణ చర్యలు బిహార్ ప్రభుత్వ అధికారులకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేయబడింది.
ఈ పరిణామాలపై బిహార్ పోలీసు ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. తమ అధికారుల ప్రతిష్టకు భంగం కలిగేలా ఇతర రాష్ట్రాలు వ్యవహరించకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీంతో బిహార్ ప్రభుత్వం ఈ రక్షణ చర్యలు చేపట్టింది.

