తిరుచ్చి జిల్లా పెట్టవాయిత్తలై సమీపంలో తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ఎన్నికల ప్రచార కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఎన్నికల ఫలితాల ప్రకటనకు కొద్ది రోజుల ముందు జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల ప్రాంతంలో కామనాయకన్ పాళయం గ్రామంలో ఉన్న సుమారు 400 చదరపు అడుగుల తాటిపాక షెడ్డులో TVK పార్టీ శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గ ప్రచార కార్యాలయంలో మంటలు చెలరేగాయి. గ్రామస్థులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే కార్యాలయం పూర్తిగా కాలిబూడిదైంది.
దుండగులు కార్యాలయాన్ని తగలబెట్టడంతో పాటు, సమీపంలో ఏర్పాటు చేసిన TVK శ్రీరంగం అభ్యర్థి ఎస్. రమేష్కు సంబంధించిన భారీ డిజిటల్ బ్యానర్ను కూడా చింపివేసి ధ్వంసం చేసినట్లు తెలిసింది. ఈ చర్యలను పోలీసులు ఉద్దేశపూర్వకంగా చేసిన దుశ్చర్యగా అనుమానిస్తున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు కేవలం నాలుగు రోజుల ముందు ఈ సంఘటన జరగడంతో రాజకీయ వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై లోతుగా విచారిస్తున్నారు.









