నంద్యాల, జూన్ 30
చదువు పేరుతో పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్, షూస్ వంటి వాటితో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేల, లక్షల రూపాయలు వసూలు చేస్తూ వ్యాపారం చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై ఎమ్ఈఓ ఆఫీస్ ఎదుట వారు ధర్నా నిర్వహించారు.
చదువు పేరుతో పాఠశాలల ఆవరణంలోనే పుస్తకాలు, యూనిఫామ్, షూస్ వంటి వాటితో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేల, లక్షల రూపాయలు వసూలు చేస్తూ వ్యాపారం చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎమ్ఈఓ ఆఫీస్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని విద్యాసంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ టౌన్ అధ్యక్షులు శివకుమార్, ఉపాధ్యక్షులు సాయి కుమార్ మాట్లాడుతూ, నంద్యాలలోని ప్రైవేట్ విద్యాసంస్థలు కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అక్రమ సంపాదనకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. భాష్యం, కేశవరెడ్డి, గురురాజా, గుడ్ షేపేర్డ్, నారాయణ, శ్రీ చైతన్య, ఢీల్లీ పబ్లిక్ వంటి పాఠశాలల్లో ఎలాంటి సదుపాయాలు లేకపోయినా ఉన్నాయని మాయమాటలతో తల్లిదండ్రుల నుండి పుస్తకాలు, యూనిఫామ్, షూస్, మెయింటినెన్స్ పేరుతో భారీగా వసూలు చేస్తున్నారని తెలిపారు.
ఎస్ఎఫ్ఐ ప్రశ్నించగా తామే ఉత్తములమని ప్రవర్తిస్తున్నారని, కార్పొరేట్ విద్యాసంస్థలు దోపిడీకి పాల్పడుతుంటే అడ్డుకుంటున్నామని, కానీ తమను ఎవరు గమనించగలరనే అపోహతో ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా విచ్చలవిడిగా చదువుతో వ్యాపారం చేస్తున్నాయని విమర్శించారు. ఫీజులు, పాఠ్యపుస్తకాలు, ఇతర పేర్లతో అక్రమ సంపాదనకు కేరాఫ్ అడ్రస్ గా మారడం దుర్మార్గమని అన్నారు.












