ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త పెన్షన్ల మంజూరు, పంపిణీ ప్రారంభించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా, గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన స్పౌజ్ కేటగిరి (భర్త చనిపోయిన భార్యకు) పింఛన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించనుంది.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఎవరికీ పెన్షన్లు మంజూరు చేయలేదనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అర్హులైన లబ్ధిదారులందరికీ సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ చర్యలు చేపడుతున్నారని అధికారులు తెలిపారు.
కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం వంటి వివరాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. దీనిపై సంబంధిత శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే ఉన్న పెన్షన్ల పంపిణీలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, లబ్ధిదారుల ఖాతాల్లోకి సకాలంలో పెన్షన్లు జమ అయ్యేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.












