భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను తిరస్కరిస్తూ భరత్పూర్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్ను జస్టిస్ సుదేశ్ బన్సల్ మరియు జస్టిస్ అనిల్ కుమార్ ఉపమన్లతో కూడిన డివిజన్ బెంచ్ కొట్టివేసింది. వైవాహిక జీవితంలో చిన్నపాటి హెచ్చుతగ్గులు సహజమని, విడాకులు మంజూరు చేయడం వల్ల కుటుంబానికి నష్టం వాటిల్లుతుందని కోర్టు పేర్కొంది.
సుదీర్ఘ దాంపత్య జీవితం కలిగిన ఈ దంపతులకు 1967లో వివాహం జరిగింది. 2013 వరకు దాదాపు 46 ఏళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. అయితే, 2014లో భర్త విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.
తన భార్య పెట్టిన వరకట్న వేధింపుల కేసు అబద్ధమని పోలీసులు తేల్చారని, ఇది తనను అవమానానికి గురిచేసిందని భర్త తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆస్తి విభేదాలు, భార్య నిర్లక్ష్యం, అక్రమ సంబంధాల ఆరోపణలు కూడా ఆయన లేవనెత్తారు.
భర్త ఆస్తిని దుర్వినియోగం చేస్తున్నారని, ఆయన తమ్ముడి మాటలు విని విడాకులకు ప్రయత్నిస్తున్నారని భార్య ఆరోపించారు. ఆయనకు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని, ఒక మహిళను తన గదిలోకి రప్పించారని, ఈ కారణంగానే తాను పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.
ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన ఫ్యామిలీ కోర్టు, విడాకుల పిటిషన్ను తిరస్కరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ భర్త డివిజన్ బెంచ్ను ఆశ్రయించగా, అక్కడ కూడా ఆయన అప్పీల్ కొట్టివేయబడింది. వైవాహిక బంధాన్ని కాపాడాల్సిన ఆవశ్యకతను కోర్టు నొక్కి చెప్పింది.












